Friday, September 29, 2017

నవరాత్రి పద్యము ౨౦౧౭

ఈ సారి నవరాత్రికి వాట్సాప్ లో,  భువనైకమాత పలురూపాలను వివరిస్తూ స్నేహితులు పంపిన సమాచారాన్ని ఆధారం చేసుకొని - రోజుకొక పాదం చొప్పున సీసపద్యము, పదవరోజైన విజయదశమినాడు ఎత్తుగీతి వ్రాసాను.

భగవదాంకితమైన ఈ పద్యములో సంస్కృతనామాలు ఉన్నవి, వాటిలో ఎవైనా వ్యాకరణబద్ధంగా లేనిపక్షాన తెలియజేయండి, సవరిస్తాను.

నమస్సులు,


నవరాత్రి ౨౦౧౭ నవపాదసీసము.
1. కఠినపర్వతరాజు కందువపట్టివి, దురు సింతలేదు మృదుత్వమేను
2. బ్రహ్మచారిణి వయ్యు బంధనవ్యామోహ గృహజీవుల యెడఁ సుదృక్కు వీవు
3. దుర్గమాన్వేషణాంతర్గతప్రశమనవీచివౌ ధర్మదిక్సూచి నీవు
4. నిఖిలజగజ్జనని యఖిలరోచిష్మతీ చరాచరధారయిత్రివమ్మ
5. నీచరాక్షసగణ నిజమూలనిర్మూలకారక గురుగుహ వీరమాత
6. తల్లివై ప్రోచు కాత్యాయనివై కాఁచు దురితము లడచఁగ దుర్గ వీవు
7. కాలభయంకర కల్మషహారిణి కలజన కిల్బిషకాలహంత్రి
8. అచలశక్తియుతేమహాదేవి వృషభాసనాఘవైరీ మౌక్తికామలతేజ
9. శితికంఠు ఘనతపస్సిద్ధికై పటుతర సిద్ధులనొసఁగిన సిద్ధిదాత్రి

తే. వివిధరూపంబులన్ జగద్విదితవిధులఁ
లోకకల్యాణంబున్ భువనైకజనని
కలుగజేసిన నీమహిమలఁ సదమల
ముద మలరుభక్తి స్తుతియించి మొ్రక్కులిడుదు

Sunday, September 17, 2017

బే యని గౌరవము

ఈ రోజు రసధునిలో, ఛందస్సులో రవిప్రసాద్ గారు ఇచ్చిన సమస్య ఇది

బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

సమస్యని ఇవ్వడంలో కూడా ఆయన చక్కటి ప్రతిభను కనబరచినారు. బే ను బు+ఏ గా విడిదీసినప్పుడు కూడా కవీశ్వరుని అనే పదము కవి+ఈశ్వరుని అని విడుతుంది కనుక యతి చెల్లేవిధంగా, అలా కాకుండా బే ను బే గానే విడిచి పూరించిన వారికి కూడా అఖండయతి చెల్లే రీతిలో ఉన్నది.

ఇక నేను పూరించినది ఇది.

రాయలవారికొల్వుకుఁ పరాయిగవచ్చినవాడె యందఱిన్
వ్రాయసకారులెవ్వరని పందెమువేయఁగ బృవ్వుతోడ బా
బాయనిచెప్పివాని తలవంచగ లింగడ వీవు కారణం
బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

రాయవవారి కొలువుకు పరాయిదేశం నుండి ఒక కవి రావడం, నేను మీరేది చెపితే అది వ్రాయగలను, నాకు ధీటుగా నిలిచే వ్రాయసకారులు ఎవ్వరైనా ఉన్నారాయని అడిగినప్పుడు - ఎంతటి సంక్లిష్టమైన పదబంధాలు, పద్యాలు ఇచ్చినా చటుక్కున వ్రాసిపడేసిన ఆ కవిని బృవ్వటబాబా అనే పద్యాన్ని చదివి తికమకపెట్టిన తెనాలిరామలింగడి కథ జగద్విదితమే. ఆ కథనే నేను పద్యములో వాడుకున్నాను.

బే ను కారణంబే అని వ్రాసుకున్న పిమ్మట మిగతా ఇతివృత్తతాన్ని ఎంచుకోవడం ఒక్కటే మిగిలిన పని. అక్కడ నాకు మనకు ప్రియుడైన వికటకవి సహకరించినాడు.

Sunday, September 3, 2017

పింగళిసూరన కళాపూర్ణోదయం - చిత్రకవిత్వం

ఫేస్బుక్కులో రసధుని సమూహములో రూపనగూడి సుగుణగారి టపా ఇది.  అందఱూ చదివి ఆనందింతురు గాక.

--

ఈ పద్యము పింగళి సూరన గారి కళాపూర్ణోదయము లోనిది. పద్యము,శ్లోకముల అర్థములను అడిగినవెంటనే వివరించి పంపిన గురువుగారు శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారికి హృదయపూర్వక నమస్కారములు, మరియు ధన్యవాదములు.
తా వినువారికి సరవిగ/
భావనతో నానునతి విభా వసుతేజా/
దేవర గౌరవ మహిమన/
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

ఈ పద్యమును తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది!
శాధీనకు మా గిరి మత/
వికనసి లవమాన మహిమ వర గౌరవ దే/
జాతే సువ భావి తినను/
నాతో నవభాగ విరస కిరివానువితా
(కళాపూర్ణోదయం ,పింగళి సూరన)
తెలుగు సాహిత్య మందలి చతుర్విధ కవితలలో చిత్ర కవిత్వ మొకటి. ఈ రచన కవికి
భాషపై,శబ్దములపై గల అధికారమును,అందలి నిష్ణాతృత్వమును వ్యక్తపరుచును.
ఈ పద్ధతిలో కావ్యములు కూడా వచ్చినవి. ఇది ఒక రసానుభూతిని కల్గించు కవిత. మన
కవుల ప్రతిభకు ఈ పద్యము ఒక నిదర్శనమై నిలుస్తుంది.
తెలుగుటీక :--: అతివిభావి సుతేజా!- మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల,
అధీశా- రాజా!; దేవర గౌరవ మహిమన =ఏలినవారి మహిమాతిశయముచేతనే;
మావలసిన కవిత= మా ప్రియమైన కవిత్వము; తాన్ =అది, వినువారికి =శ్రోతలకు;
శ్రోతలకు ; సరవిగన్--తగురీతిని ; భావనతోన్--తలచినంతనే ;
మాకున్ మరగిమాకు స్వాధీనమై ; ఆనున్--భాసిల్లును;
భావము: ఆశ్రయ దాతలైన తమ మహిమాతి శయముచేతనే శ్రోతల కానందమును గూర్చు యీ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది;
సంస్కృతము:- పదవిభాగము;
శాధి , ఇనకుమ్ ,అగిరి ,మత ,వికనసి ,లవమాన ,మహిమ
వరగౌరవదే ,జాతే , సువిభౌ , ఇతి , నను ,నా ,అతః , నవభాః , గవి,రస, కిరి,వా వినుతా,
టీక :- ఇన- రాజా! ; ఆగిరి- పర్వతములున్నంతకాలము, కుం =భూమిని;
; శాధి--పాలింపుము ; మత = సర్వమత సమ్మతుడా!; వికనసి= మిక్కిలి కీర్తిచే విరాజిల్లు
చున్నవాడవు ; లవమాన--లవునివలె మానవంతుడవగు ; నను-- ఓ రాజా!;
నహిమ వర గౌరవదే--గొప్పతనముచే మిక్కిలి గౌరవమునిచ్చు; సువిభౌ =నీ వంటి ప్రభువు; ఇతి= ఈ రీతి; జాయతే= కలిగియుండగా ; నా =మనుజుడు (పండితుడు)
అతః--ఇట్టిగౌరవము వలన ;నవభాః--క్రొత్త వికాసము గలవాడై ;
రసకిరి--నవరసములను వెదజల్లు ; గవి- భాషయందు ; అను వితావా =నుతియింప కుందురా?
భావము:-ఓరాజా! ధరలో గిరులున్నంత కాలమీ ఇల(భూమి)నేలుము. శ్రీరామ కుమారుడగు లవుని వంటి యభిమానధనుడా! గౌరవాదరము జూపు నీవంటి ప్రభువు
రాజైయుండగా పండిత కవులు రస వంతములగు కవితలతో నిన్ను
స్తుతింప కుందురా?