Sunday, April 2, 2017

దుర్యోధనుని వ్యథ

నేడు ముఖపుస్తకపు ఛందోసమూహములో ధనికొండ రవిప్రాసద్ గారు ఇచ్చిన వర్ణనాంశము, దుర్యోధనుని వ్యథ.

ఒకవేళ కర్ణుఁడు ఏ కారణము చేతనో పరాయి పక్షమైన పాండవులను చేరినట్లు దుర్యోధనునికి తెలిసనట్లైతే ఆతడి మనోగత మేవిధముగా ఉంటుందో చిత్రీకరించాలి. స్వేచ్ఛా ఛందము.


అంశాన్ని గూర్చి ఆలోచించగానే మొట్టమొదట తట్టినది, ద్రౌపదీ వృత్తాంతము. ద్రౌపది నల్లనిదైనా ఎంతో అందమైనదని జగద్విదితమే. ఆమె మేనిరంగు కారణంగానే కృష్ణ అనే పేరును కూడా పడసినది. మొదటి పాదము కూర్పగానే, తళుక్కమని ఒక ఆలోచన మెదిలింది.

కృష్ణ శబ్దముతో నలువురి పే ర్లున్నాయి మహాభారతంలో. కృష్ణ అంటే ద్రౌపది అనే చెప్పుకున్నాం. కృష్ణభగవానుడు ఉండనే ఉన్నాడు. శరీరఛాయ వలన ఆర్జునుడు కూడా కృష్ణుడే. ఇక మహాభారత సూత్రధారి వంటివాడు వ్యాసుఁడు, ఆయన పేరు కృష్ణద్వైపాయనుఁడు. ఆయన పేరులోనూ కృష్ణ శబ్దము ఉన్నది.  వీరిలో మువ్వురు పాండవపక్షాన ఉన్నవారే. వేదవ్యాసుఁడు ధర్మము వైపు ఉన్నవా డనుకోవడంలో ఎటువంటి సందేహానికి తావులేదు.

ఇదీ నేపధ్యం. ఇక పూరణ చూడండి.

సీ. అక్కటా వగలాడి కా కృష్ణ కారవ వరుఁడైన సుఖమంచు భ్రమసినాడొ
అంగదేశము చాల కా కృష్ణు మాయలం బడి లోభనమ్ముల సడలినాడొ
అలనాటి ఆడంగి యా కృష్ణు పాశుపతాస్త్రపు కథలకు నడలినాడొ
అడవులం జీవించు నా కృష్ణు నెచ్చటో కలసి నా కెదురేగ కదలినాడొ
 

తే. కృష్ణ శబ్దమ్ములోనున్న కితవ మేమొ
నలుపు చీకట్లు వ్యాపించెఁ నాల్గు దిశలఁ
కర్ణు డావల బోయనే కష్ట మొదవెఁ
గృష్ణ వర్ణాభిధానలు కీడు సలుప


కితవము అంటే చెడ్డది
అభిధానము అంటే పేరు
ఒదవు అంటే కలుగు.

అదండీ సంగతి.

No comments:

Post a Comment