Saturday, December 2, 2017

కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

ధనికొండవారు నేడు ఇచ్చిన సమస్య ఇది

కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

ఇది తేటిగీతి పదాము. దాని వలన కాలు పదాన్ని అంత్యప్రత్యయంగా (ప్రిఫిక్స్) మార్చి వ్రాయలనుకుంటే కాలు ముందుగా వచ్చే పదము (లేక పదభాగము) ఇంద్రగణము III లేక UI అయి ఉండాలి. దాని వల్ల లోకాలు వంటి ప్రయోగాలు చెల్లవు.

నేను వాడిన రెండు రకాల ప్రయోగాలు ఇవిగో.

తే.గీ. ఆడుపెండ్లివారికి కష్టమబ్బి మరల
యెదుటి మగపెండ్లి వారల కెక్కతాళు
లంపు నవకాశమిచ్చు కట్నంపు పంప
కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

- కట్నాన్ని తొలగించాలని మొదటిది

తే.గీ. పన్ను సేకరింప వెసలబాటులేని
చెడుపదార్థము వెనుకకు చేర్చలేని
ఖలుల జేబులు నింపు నక్రమపు టమ్మ
కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

- అక్రమపుటమ్మకాలు తొలగించాలని రెండవది.

Friday, September 29, 2017

నవరాత్రి పద్యము ౨౦౧౭

ఈ సారి నవరాత్రికి వాట్సాప్ లో,  భువనైకమాత పలురూపాలను వివరిస్తూ స్నేహితులు పంపిన సమాచారాన్ని ఆధారం చేసుకొని - రోజుకొక పాదం చొప్పున సీసపద్యము, పదవరోజైన విజయదశమినాడు ఎత్తుగీతి వ్రాసాను.

భగవదాంకితమైన ఈ పద్యములో సంస్కృతనామాలు ఉన్నవి, వాటిలో ఎవైనా వ్యాకరణబద్ధంగా లేనిపక్షాన తెలియజేయండి, సవరిస్తాను.

నమస్సులు,


నవరాత్రి ౨౦౧౭ నవపాదసీసము.
1. కఠినపర్వతరాజు కందువపట్టివి, దురు సింతలేదు మృదుత్వమేను
2. బ్రహ్మచారిణి వయ్యు బంధనవ్యామోహ గృహజీవుల యెడఁ సుదృక్కు వీవు
3. దుర్గమాన్వేషణాంతర్గతప్రశమనవీచివౌ ధర్మదిక్సూచి నీవు
4. నిఖిలజగజ్జనని యఖిలరోచిష్మతీ చరాచరధారయిత్రివమ్మ
5. నీచరాక్షసగణ నిజమూలనిర్మూలకారక గురుగుహ వీరమాత
6. తల్లివై ప్రోచు కాత్యాయనివై కాఁచు దురితము లడచఁగ దుర్గ వీవు
7. కాలభయంకర కల్మషహారిణి కలజన కిల్బిషకాలహంత్రి
8. అచలశక్తియుతేమహాదేవి వృషభాసనాఘవైరీ మౌక్తికామలతేజ
9. శితికంఠు ఘనతపస్సిద్ధికై పటుతర సిద్ధులనొసఁగిన సిద్ధిదాత్రి

తే. వివిధరూపంబులన్ జగద్విదితవిధులఁ
లోకకల్యాణంబున్ భువనైకజనని
కలుగజేసిన నీమహిమలఁ సదమల
ముద మలరుభక్తి స్తుతియించి మొ్రక్కులిడుదు

Sunday, September 17, 2017

బే యని గౌరవము

ఈ రోజు రసధునిలో, ఛందస్సులో రవిప్రసాద్ గారు ఇచ్చిన సమస్య ఇది

బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

సమస్యని ఇవ్వడంలో కూడా ఆయన చక్కటి ప్రతిభను కనబరచినారు. బే ను బు+ఏ గా విడిదీసినప్పుడు కూడా కవీశ్వరుని అనే పదము కవి+ఈశ్వరుని అని విడుతుంది కనుక యతి చెల్లేవిధంగా, అలా కాకుండా బే ను బే గానే విడిచి పూరించిన వారికి కూడా అఖండయతి చెల్లే రీతిలో ఉన్నది.

ఇక నేను పూరించినది ఇది.

రాయలవారికొల్వుకుఁ పరాయిగవచ్చినవాడె యందఱిన్
వ్రాయసకారులెవ్వరని పందెమువేయఁగ బృవ్వుతోడ బా
బాయనిచెప్పివాని తలవంచగ లింగడ వీవు కారణం
బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

రాయవవారి కొలువుకు పరాయిదేశం నుండి ఒక కవి రావడం, నేను మీరేది చెపితే అది వ్రాయగలను, నాకు ధీటుగా నిలిచే వ్రాయసకారులు ఎవ్వరైనా ఉన్నారాయని అడిగినప్పుడు - ఎంతటి సంక్లిష్టమైన పదబంధాలు, పద్యాలు ఇచ్చినా చటుక్కున వ్రాసిపడేసిన ఆ కవిని బృవ్వటబాబా అనే పద్యాన్ని చదివి తికమకపెట్టిన తెనాలిరామలింగడి కథ జగద్విదితమే. ఆ కథనే నేను పద్యములో వాడుకున్నాను.

బే ను కారణంబే అని వ్రాసుకున్న పిమ్మట మిగతా ఇతివృత్తతాన్ని ఎంచుకోవడం ఒక్కటే మిగిలిన పని. అక్కడ నాకు మనకు ప్రియుడైన వికటకవి సహకరించినాడు.

Sunday, September 3, 2017

పింగళిసూరన కళాపూర్ణోదయం - చిత్రకవిత్వం

ఫేస్బుక్కులో రసధుని సమూహములో రూపనగూడి సుగుణగారి టపా ఇది.  అందఱూ చదివి ఆనందింతురు గాక.

--

ఈ పద్యము పింగళి సూరన గారి కళాపూర్ణోదయము లోనిది. పద్యము,శ్లోకముల అర్థములను అడిగినవెంటనే వివరించి పంపిన గురువుగారు శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారికి హృదయపూర్వక నమస్కారములు, మరియు ధన్యవాదములు.
తా వినువారికి సరవిగ/
భావనతో నానునతి విభా వసుతేజా/
దేవర గౌరవ మహిమన/
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

ఈ పద్యమును తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది!
శాధీనకు మా గిరి మత/
వికనసి లవమాన మహిమ వర గౌరవ దే/
జాతే సువ భావి తినను/
నాతో నవభాగ విరస కిరివానువితా
(కళాపూర్ణోదయం ,పింగళి సూరన)
తెలుగు సాహిత్య మందలి చతుర్విధ కవితలలో చిత్ర కవిత్వ మొకటి. ఈ రచన కవికి
భాషపై,శబ్దములపై గల అధికారమును,అందలి నిష్ణాతృత్వమును వ్యక్తపరుచును.
ఈ పద్ధతిలో కావ్యములు కూడా వచ్చినవి. ఇది ఒక రసానుభూతిని కల్గించు కవిత. మన
కవుల ప్రతిభకు ఈ పద్యము ఒక నిదర్శనమై నిలుస్తుంది.
తెలుగుటీక :--: అతివిభావి సుతేజా!- మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల,
అధీశా- రాజా!; దేవర గౌరవ మహిమన =ఏలినవారి మహిమాతిశయముచేతనే;
మావలసిన కవిత= మా ప్రియమైన కవిత్వము; తాన్ =అది, వినువారికి =శ్రోతలకు;
శ్రోతలకు ; సరవిగన్--తగురీతిని ; భావనతోన్--తలచినంతనే ;
మాకున్ మరగిమాకు స్వాధీనమై ; ఆనున్--భాసిల్లును;
భావము: ఆశ్రయ దాతలైన తమ మహిమాతి శయముచేతనే శ్రోతల కానందమును గూర్చు యీ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది;
సంస్కృతము:- పదవిభాగము;
శాధి , ఇనకుమ్ ,అగిరి ,మత ,వికనసి ,లవమాన ,మహిమ
వరగౌరవదే ,జాతే , సువిభౌ , ఇతి , నను ,నా ,అతః , నవభాః , గవి,రస, కిరి,వా వినుతా,
టీక :- ఇన- రాజా! ; ఆగిరి- పర్వతములున్నంతకాలము, కుం =భూమిని;
; శాధి--పాలింపుము ; మత = సర్వమత సమ్మతుడా!; వికనసి= మిక్కిలి కీర్తిచే విరాజిల్లు
చున్నవాడవు ; లవమాన--లవునివలె మానవంతుడవగు ; నను-- ఓ రాజా!;
నహిమ వర గౌరవదే--గొప్పతనముచే మిక్కిలి గౌరవమునిచ్చు; సువిభౌ =నీ వంటి ప్రభువు; ఇతి= ఈ రీతి; జాయతే= కలిగియుండగా ; నా =మనుజుడు (పండితుడు)
అతః--ఇట్టిగౌరవము వలన ;నవభాః--క్రొత్త వికాసము గలవాడై ;
రసకిరి--నవరసములను వెదజల్లు ; గవి- భాషయందు ; అను వితావా =నుతియింప కుందురా?
భావము:-ఓరాజా! ధరలో గిరులున్నంత కాలమీ ఇల(భూమి)నేలుము. శ్రీరామ కుమారుడగు లవుని వంటి యభిమానధనుడా! గౌరవాదరము జూపు నీవంటి ప్రభువు
రాజైయుండగా పండిత కవులు రస వంతములగు కవితలతో నిన్ను
స్తుతింప కుందురా?

Tuesday, August 29, 2017

బుద్ధలేని వాడె బుద్ధు డనగ

ఈ వారం ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య - బుద్ధలేని వాడె బుద్ధు డనగ.

దీనిని మందుగా గొతమబుద్ధునికి జ్ఞానోదయం కాకముందు ఆయన అనుభవించిన సుఖాలను ఒకప్రక్క, వాటిని విడిచిన వెళ్లిన వైనం మఱొక ప్రక్క వ్రాద్దామని ఆలోచిస్తూ  - అప్పటికే రాజ్యలక్ష్మితో మొదలుపెడదామా, లేక వంశపారంపర్యముగా వచ్చిన సంపదతో మొదలుపెడదామా అని సతమతమవుతున్న నాకు అంగుళిమాలుని పేరు గురుతువచ్చింది. నెమ్మదిగా వ్రేలు తరిగి మాలచేసేవానికి వేలిచ్చి ముందుకు తీసుకపోయి జ్ఞానబోధచేసిన బుద్ధుడే మనసులో మెదిలాడు.

అలా ఈ పద్యం పుట్టింది. అదీ సంగతి.

సీ. గణ్యులు వినుతించు పుణ్యపథము వీడి పెడత్రోవలఁ వెడలి పెచ్చరిల్లి
రహదారుల నిలచి యహరహ మధికమౌ హింసకు పాల్పడి యీసడించి
తెరువరులను బట్టి పరలోకమున కంపి వ్రేలొక గుఱుతుగా మాలఁ జేర్చి
నరకమార్గముల వినాశకుం డంగుళిమాలుడై బ్రతుకు నమ్మారకుండు

ఆ.వె. మారకుండ వదల కూరకుండని స్వార్థ 
బుద్ధిలేనివాడె బుద్ధుడనగ
జెలగె వసుధలోన చేరబిల్చి ఖలుజ
న్మంబునటుల సార్థకంబుజేసె

అహరహము - అంటే ఎల్లప్పుడూ
తెరువరి - అంటే ప్రయాణికుడు. చిన్నయసూరి వ్రాసిన పంచతంత్రకథ తొల్లియొక తెరువరి అనే వాక్యంతోనే ప్రారంభమవుతుందని లీలగా జ్ఞాపకం
మారకుండు - అంటే హింసకుపాల్పడేవాడు

మఱియొక్క విషయమూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను వ్రాసే పద్యాలకు ప్రేరణగా, ఆలోచనలకు ఊతగా నిలిచినవాటిలో ధనికొండవారి సమస్యలది సింహభాగమే. అందువల్ల ఈ పద్యాన్ని ఆయనకే గౌరవంగా అంకితమిస్తున్నాను. ఆయన స్వీకరిస్తారని ఆశిస్తాను. 

Sunday, August 27, 2017

వరమే పదితలలవాని ప్రాణముఁదీసెన్

కంది శంకరయ్యగారి సమస్యకు నా పూరణ

కం.  మొరపెట్టిన భగినీవా
చరములఁ గురుతుల్ పడిన విచారింపగ తా
పరిభవ మొందిన స్వయం
వరమే పదితలలవాని ప్రాణముఁదీసెన్

మొరపెట్టిన భగినీవాచరముల అంటే కష్టముచెప్పుకున్న చెల్లెలి పరితప్తవాక్కులలో అని అర్థం.

మరి ఆమె చెప్పుకువచ్చిన కథవల్లనే కదా రావణునికి శివధనుర్భంగప్రయత్నసమయాన తనకు జరిగిన గర్వభంగము జ్ఞప్తికి వచ్చింది.

అదీ సంగతి.


Wednesday, July 5, 2017

శరశరసమరైకసూర

శరశరసమరైకశూర - SaraSarasamaraika Soora
కుంతలవరాళి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి కూర్చిన కృతి శరశరసమరైక శూర.
పల్లవి - శర శర సమరైక శూర,| శరధిమదవిదార
అనుపల్లవి - సురరిపుబల మను తూల|గిరుల కనల సమమౌ శ్రీరామ
చరణము - తొలిజేసిన పాపవనకుఠార, మా|కలనైన సేయగలేని
బలువిలును విఱిచి వెలసిన శ్రీరఘు|కులవర బ్రోవుము, త్యాగరాజనుత
తాత్పర్యం ఇది..
పల్లవి - (కాకాసుర సంహారంలో) దర్భను బాణంగా వాడిన అసదృశ శూర, (వారధి నిర్మాణానికి ముందు) సముద్రుని మదాన్ని అణచిన వీరా, శ్రీరామా

అనుపల్లవి - రాక్షసుల బలము అగ్నివంటి నీ ముందు దూదికొండ వంటిది

చరణము - నీవు మా పాపములనబడే వనమును తెగనరికే గొడ్డలివంటి వాడివి, మా వంటివారెవఱూ సాహసింపజాలని గొప్పవిల్లును విఱిచిన రఘువంశోత్తమా, త్యాగరాజుచే నుతింపబడిన శ్రీరామా.

ఇందులో గమనించవలసిన విషయమొకటి ఉన్నది. చరణములో మొదటి పంక్తిని సాధారణంగా గాయకులు తొలిచేసిన పాపవన కుఠారమా అని పాడడం కద్దు. ఇది తప్పు.

మొదటి కారణం ప్రియమిత్రుడురాఘవుడు చెప్పింది. 
మా ను పూర్వపదంలో ఎందుకు కలపకూడదంటే, సంబోధన రఘుకులవర, శరశర, సమరైకశూర... ఇలాగే ఉంది కనుక. కుఠార అనే తీసుకోవాలి తప్పితే కుఠారమా అని తీసుకోకూడదు. కుఠారమా అనటం వల్ల ఇంకొక దోషమేమిటంటే పుంరూపానికి నపుంసకత్వం ఆపాదిస్తున్నట్టు.

రెండవ కారణమేమిటంటే, తప్పుడు విఱుపు చేసి కుఠారమా అని పాడితే తరువాత పంక్తి అసంపూర్ణంగా ఉంటుంది. ఏది ఏమైనా కుంతలవరాళిలో వినడానికి సొంపుగా, దరువులు వేస్తూ పాడకోవడానికి ఇంపుగా ఉండే కృతి ఇది.

==

(raagam: kuntalavaraali, taaLam: aadi)

pallavi - Sara Sara samaraikaSoora,| Saradhimadavidaara
anupallavi - suraripubala manu toola|girula kanala samamau Sree Rama
caraNam - tolijEsina paapavanakuThaara, maa|kalanaina sEyagalEni
baluvilunu virici velasina Sree Raghu|kulavara brOvumu, tyaagaraajanuta

1) Sara Sara samaraikaSoora,| Saradhimadavidaara
Sara - blade of grass (darbha)
Sara - arrow
samaraikasoora - warrior nonpareil
saradhimadavidaara - destroyer of samudra's pride/arrogance
Meaning: Rama, the destroyer of samudra's arrogance, you're like no other warrior the world knows. No other warrior can use a blade of grass as an arrow.

2) suraripubala manu toola|girula kanala samamau Sree Rama
i) sura-ripu-balamu + anu = sura-ripu-bala manu.
sura are gods
ripu is an enemy, so a suraripu is a raakshasa.
balamu is strength, anu is named
ii) toola-girulaku + anala = toola-girula-kanala (ukaarasandhi! ఉకారసంధి)
toola is cotton
girulu are mountains. girulaku is 'for mountains'
anala is fire
samamau is equivalence
Meaning: If the strength of demons is a mountain, when faced by your ferocious valor that is akin to fiery fire , it is like a cotton mountain.

3) tolijEsina paapavanakuThaara
toli is previously
cEsina is done
paapavana is sins comparable to a forest
kuThaara is an axe. A point to note is that kuThaara here is not a word by itself but relies on the earlier phrase 'paapavana'.
Meaning: If our sins were a forest, you'd be a hatchet. (Note: After kuThaara there should be small pause or break, it should not be sung as kuThaaramaa. As my dear friend Raaghava pointed out to me, that would be equivalent to choosing neutral gender similie for masculine gender. Secondly, it also leaves the next sentence in the song incomplete.)

4) maa|kalanaina sEyagalEni,
baluvilunu virici velasina Sree Raghu|kulavara brOvumu
maa kalanaina is even in our dreams
sEyagalEni is impossible
balu+vilunu is a huge bow (whcih is Siva-dhanussu)
virici is break
velasina is born
Sree Raghu+kula+vara is the exemplary one in Raghu's lineage
Meaning: Rama, the finest in Raghu's vamsa, you did something mere mortals cannot even begin to dream doing, you broke Siva's famed bow.

This kRti as with many others composed by The Great Saint has the familiar word play. A few to note are
1) Usage of Sara twice in the first line with different connotations
2) Usage of praasa - matching consonants in a pair of lines
SaraSara and Saradhi in the first line
suraripu and girulaku in the second line
toli and kala in the first line of caraNam
bala and kula in the second line of caraNam
Above all, this is a great kRti that pulls the listener into its inherent rhythm right from the start.

Thursday, June 29, 2017

పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున

కందిశంకరయ్యగారు, ఈ విధంగా శెలవిచ్చారు. నిన్న.

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున"
(లేదా...)
"భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్"

నేను ఈ విధంగా పూరించాను

ఆ.వె. అయ్యవారు గృహము నందుఁ జేయఁ దొడఁగె
నంగరంగభోగ మతిశయిల్లఁ
గలికి యా ధరణిజకల్యాణ మా దేవి
పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున

ఉ. స్మార్త పురోహితుం డొకఁడు చక్కగ జేయ నుపక్రమించె స
ద్వర్తన మాచరించు విధి భార్యయు దోడుగ నిల్వ గేహమున్
మూర్తులఁ దెచ్చి పెండిలి సముద్భవభక్తి మహీజ చెల్వుడౌ
భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్

Tuesday, April 4, 2017

శ్రీరామనవమి పద్యాలు

హేవళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి.

ఇవిగో శ్రీ రాముని గొప్పదనం తెలుపుతూ నేను వ్రాసిన పద్యాలు

సీ. ఎనలేని సంపద లొనగూడి నట్లుండి, మాయమై పోయినన్ మథనపడడు
సిరులదేవతవంటి సీతమ్మ తోడుగా నడచిన చాలని నమ్మియుండి
వేవేల రక్కసుల్ వెనువెంట నిక్కట్లు వేగాన మూగినన్ వెతలబడ డ
నంత తేజు డనుజు డంతటన్ నీడగా నిలచిన మేలని నెమ్మదించి

తే. పోరు కుద్బలుఁ గెలువంగ పూనివచ్చె
శత్రుభీకర రుద్రుండు మిత్రు డనుచు
ననిమిషాంశపు పరివార మటులయుండ
పుడమియం దాత డవతార పురషుఁ డయ్యె

మ. పరికింపన్ సిరిరూపు సీతయన, శ్రీప్రాణేశ్వరుం డాతఁడే
అరయం దమ్ము డనంత రూపుడన, నయ్యక్షాని కం డాతఁడే
చిరజీవుం డనుమయ్య రుద్రుఁడన, నా శ్రేష్ఠాత్ము నిష్ఠాతఁడే
స్థిరపూజ్యుల్ పరివారమై చనుట జేజేపట్టె ముల్లోకముల్

వివరణ

చేతికందుతుందనుకున్న రాజ్యము కైకేయి కోరికల వలన మాయమైపోయింది. అయినా కలతచెందలేదు రామయ్య. సిరులదేవత (గృహలక్ష్మి లేక శ్రీమహాలక్ష్మి) వంటి భార్య తనవద్దనుంటే అదే అన్నిసంపదలకూ సరియని సరిపెట్టుకున్నాడు. శ్రీహరికి తోడుగానుండేది సంపదలకొమ్మ లక్షీదేవియే కదా.

ఎందఱో రాక్షసులు ముట్టడించి కష్టాలపాలుజేసినా బాధపడలేదు. అనంతమైన తేజము (లేక ఆదిశేషుని వంటి తేజము అని కూడా అనుకోవచ్చు) కలిగియున్న తమ్ముడు నీడగా ఉన్నాడనే నెమ్మదితో.  శ్రీహరి ఆదమఱచి పరుండేది ఆదిశేషుని నీడులోనే కదా. 

ఇక, బలవంతుడైన వాడిని (ఉద్బలుణ్ణి) పోరులో గెలవడానికి వెనుకాడలేదు, శత్రువులను చీల్చిచెండాడే రుద్రుడు (రౌద్రరూపుడు లేక శివుని అంశము గలవాడు) తనకు మిత్రుడై ఉన్నాడని.

ఇట్టి దైవాంశసంభూతులు పరివామై ఉండడం వల్లనే ఆ మహానుభావుడు అవతారపురుషుడయినాడు.

సిరులదేవతకూ, అనంత తేజమునకు, రుద్రుండు - ఈ మూడు పద లేక పదబంధాలకు గల రెండర్థాలు తెలియజేస్తోంది తఱువాత పద్యము.  అక్షము అంటే పాము (శేషుడు).  మత్తేభపద్యములో మిగతాభాగము సులభగ్రాహ్యమనే భావిస్తున్నాను.

నమస్సులు.

Sunday, April 2, 2017

దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు

అంతర్జాలము నుండి సంగ్రహించినది.  వ్రాసినవాఱెవఱో తెలియదు.

--



ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ..
మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
క. జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
డిల తిరుపతి వేంకటశా
స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

అదీ వారి పాండిత్యం!

శ్రీ యన కోప మాతనికి శ్రీలు గడించెను కోట్లుకోట్లుగన్

ధనికొండవారి సమస్య.

సమస్యను చదువగానే శ్రీ తో ఏది జోడిస్తే ధనవంతులకు నచ్చినిది వస్తుందా అని ఆలోచించగా, ఎక్కువగా సమయం పట్టలేదు మహాకవి శ్రీశ్రీ పేరు తట్టడానికి.

ఇంకేమి, మిగతాదంతా శ్రీశ్రీగారి భావాలను కాస్త వడకట్టి వ్రాసేస్తే సరిపోతుంది కదా.

అదే చేసాను ఈ పూరణలో, చూడండి. భావము సులభగ్రాహ్మమే.

ఉ. సాయముజేతు మందఱికి, సంపద లున్నవి పంచిపెట్టి నీ
నా యనుభేదభావముల నమ్మక ఎల్లరు సామ్యవాదస
ద్ధ్యేయము పెంపుజేయుఁ డని తెల్పుచుపాడిన విప్లవాగ్ని శ్రీ
శ్రీ యన కోప మాతనికి శ్రీలు గడించెను కోట్లుకోట్లుగన్

దత్తపది - మూడు, ఆరు, ఏడు, పది

ముఖపుస్తక ఛందోసమూహములో ధనికొండరవిప్రసాద్ గారు ఇచ్చిన దత్తపది ఇది. మూడు, ఆరు, ఎడు, పది - ఈ పదాలను సంఖ్యాపరంగా కాకుండా వేఱే అర్థాలు వచ్చేలాగ వ్రాయాలి. పురాణేతిహాసాలు నేపధ్యంగా ఉండాలి.

ఇదిగో నా పూరణ

 సీ. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు
గండ్రగొడ్డలి పడి క్షత్రియు లారుట, వంగిన వంశము లంగలార్చు
నోడింప పదునాలు గేడులు పట్టుట, రణభూమి రావణు రాణు లేడ్చు
తిమిరము సమయింప దివినుండి దిగునట, కలిని వీడుకొలుపఁ దిలకు డొకడు

తే. మొదటి పాదమున జెలఁగు మూడు గాను
ఆపయిన పదపడి వచ్చు నారు గాను
పిదప తెలియు నేడును పదియు వరుసఁ
దరచిచూచిన హరి యవతారసంఖ్య

వివరణ ఇదిగో.

సీసపద్యములో నాలుగు పాదములు, ఒక్కో పాదానికీ రెండు భాగాలు, క్రింద నాలుగు పాదాల ఎత్తుగీతి. వ్రాసుకోవడానికీ, చెప్పడానికీ ఎంత ఉన్నా ఇన్ని పాదాలలో తప్పక పూరించవచ్చు.

నేను ఎంచుకొన్న ఇతివృత్తం - విష్ణువు యొక్క దశావతారాలలో నాలుగు అవతారాలు. నాలుగు పాదాలు, నాలుగు పదాలు, నాలుగు అవతారాలు - సరిగ్గా సరిపోతాయి.

కాస్త చమత్కారంగా ఉంటుందని సీసములో మొదటి పాదము మూడవ అవతారము, రెండవ పాదము ఆరవ అవతారము, మూడవ పాదము ఏడవ అవతారము, చివరి పాదము పదవ అవతారము చెప్పబూనాను. అదే విషయం ఎత్తుగీతిలో వివరించాను కూడా.

సీసపద్యాల పాదాలు
౧. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు

ఘనుడు, అసుర కాలము - ఘనుడెవ్వరు, అసురుడెవ్వడు, ఈ ప్రశ్నలు ఉదయించవచ్చు. ఎలాగూ పద్యము హరి అవతారాలను గూర్చి కాబట్టి, అందులోనూ బ్రహ్మ (కంజుఁడు) కు వచ్చిన కష్ణము తీర్చిన అవతారమ మేమిటో చూస్తే, వరాహావతార మని తెలుస్తుంది. ఏవైఁనా అనుమానం మిగిలి ఉంటే ఎత్తుగీతిలో మొదటి పాదము అది కూడా తీరుస్తుంది.

ఇందులో మొదటి మూడు - కాలము మూడిందనే అర్థముతో, రెండవ మూడు సంధి వల్ల వచ్చినది. కష్టము + ఊడు, కష్టమూడు.

౨. పరశురామావతారము. క్షత్రియులు, ఆరుట లో అరు ఉన్నది. ఇక్కడ ఆరు అంటే ఓడిపోవడం లేక చనిపోవడం.  వంగిన వంశములు అంగలార్చు -రెండవ ఆరు చివరన వస్తుంది. అంగలార్చు అంటే బాధపడడం.

౩. రామావతారంలో రావణుణ్ణి సంహరించడానికి పట్టింది పదునాలుగు + ఏడులు అంటే సంవత్సరాలు. మొదటి ఏడు అక్కడ. రావణుఁడు మరణించడంతో ఆయన రాణులు ఎడవడం - అక్కడ రెండవ ఏడు. పై పాదాలలో పదాలలలాగే రెండూ సంఖ్యా పరంగా రాలేదు.

౪. ఇక చివరి పాదము, (పాపాపు) చీకటిని పారద్రోలడానికి - సమయింప దివినుండి..ఇందులో పది ఉన్నది. కలిని వీడుకొలుపన్, తిలకుఁడు - కలిసి వీడుకొలుపఁ దిలకుఁడు అయ్యింది.  మఱియొక పది వచ్చింది. రెండూ మళ్లీ సంఖ్యాపరంగా రాలేదు.

ఇక మిగిలినది ఎత్తుగీతి. దావి భావము సులభగ్రాహ్యమే.

అదండీ సంగతి.

శంకరాభరణం సమస్య - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఎన్నో రోజుల తరువాత శంకరాభరణం బ్లాగు సందర్శించాను. కంది శంకరయ్యగారు ఛందోప్రక్రియలకు చేస్తున్న సేవ లనల్ప మనితరసాధ్యమూను.

ఆయన ఇచ్చిన క్రొత్త సమస్య రెండు రకాలుగా ఉన్నది,

౧. మొదటిది కందములో - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్
౨. రెండవది ఉత్పలమాలలో - నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

రెంటికీ నా పూరణలు ఇవిగో

కం. నారాయణార్చనప్రియ
శారదగానప్రియ నుతసంచారనయా
చారప్రియ కలహప్రియ
నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఉ. ఆరయ నగ్నిసాక్షిగ మను వాడిన సాక్ష్యము లెవ్వి లేకనే
జేరిరి ప్రేయసీమణులు చెంతకు నోలి హితార్థలోకసం
చారిణి భక్తిరూపిణి విశారదరాగిణి భేదనాంగనల్
నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

ముందుగా పూరణకు నేనెంచుకున్న దారి. నారదమహాముని అంటే ఆజన్మబ్రహ్మచారి అనే విషయం విదితమే. దాని వల్ల మిగిలిన దారి, ఆయనకున్న లక్షణాలను పడతులుగా చెప్పడమే. అదే చేసాను.

మొదట కందపద్యం. నారాయణార్చనప్రియ - నారదుడు నారాయణార్చకుడు కదా.
శారదగానప్రియ - సరస్వతీదేవి ప్రసాదించిన గానకళకూడా నారదమహామునికి ఉన్నది.
నుత, సంచార, నయ, ఆచార, ప్రియ - అందిరిచే పొగడబడిన లోకసంచారమనే మంటి ఆచారమూ ఆయన సొత్తు
కలహప్రియ - నారదుల గూర్చి నేటి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గుణాన్ని గురించి వేఱే చెప్పనక్కరలేదు కదా.

ఇక ఉత్పలమాల.
ఆరయ - అంటే చూడగా (ఈ పదాన్ని పూరణల్లో పూరకంగా అంటే భావార్థాలపరంగా పెద్దతేడా తీసుకవచ్చేది కాకపోయినా గణాలు యతిప్రాసలు సరిపోవడానికి వాడే పదములాగ నేను తరచూ వాడుకుంటాను)
అగ్నిసాక్షిగా మనువు ఆడిన సాక్ష్యము లేవీ లేకనే
చేరిరి ప్రేయసీ మణులు ఆయన చెంతకు
ఓలి అంటి వరుసగా, ఈ పదము కూడా ఒక రకమైన పూరక పదమే కానీ ఇక్కడ వరుసగా పేర్లు చెపుతున్నాను కాబట్టి సరిపోతుంది.
హిత, అర్థ, లోక, సంచారిణి - లోక హితార్థము సంచారము చేయడం నారదమునికి అలవాటే
భక్తిరూపిణి - నారదుడంటేనే నారాయణుని మీద భక్తి
విశారదరాగిణి - పైన చెప్పునట్టు గానకళను ఈ విధంగా చెప్పాను
భేదన, అంగన - కలహప్రియలాగానే ఇదీనూ.

ఆ విధంగా రెండు పద్యాలలోనూ నలుగురు పడతులను ఇరికించి పూరణను గట్టెక్కించాను.
 

దత్తపది - తమన్నా, త్రిష, సమంతా, కాజల్

చరచర్చలకు నెలవు వాట్సాప్ లో ఒకానొక రోజు అవధాని గారికి ఎవఱో ఇచ్చిన దత్తపది నా కంటబడింది. ఏ అవధానమో, అవధాని గారెవరో తెలియదు.

ఎలాగూ ప్రతివారమూ సమస్యలను పూరిస్తున్న అలవాటు ప్రకారము, ఇదీ తీసుకొని ఈ విధంగా పూరించాను.

తే. నేడు చూత మన్నా!  మహనీయుఁ గృష్ణు
మైత్రి షట్ రిపువుల రూపుమాపు చెలిమి
రోస మంతా సడలగ శత్రువులు చెడఁగ
పోరు కా జలజాక్షుని పొత్తు వలయుఁ

గీతపద్యాలలో నాకు తేటిగీతి పద్యాలు వ్రాయడం చాల సులువనిపిస్తుంది.

దుర్యోధనుని వ్యథ

నేడు ముఖపుస్తకపు ఛందోసమూహములో ధనికొండ రవిప్రాసద్ గారు ఇచ్చిన వర్ణనాంశము, దుర్యోధనుని వ్యథ.

ఒకవేళ కర్ణుఁడు ఏ కారణము చేతనో పరాయి పక్షమైన పాండవులను చేరినట్లు దుర్యోధనునికి తెలిసనట్లైతే ఆతడి మనోగత మేవిధముగా ఉంటుందో చిత్రీకరించాలి. స్వేచ్ఛా ఛందము.


అంశాన్ని గూర్చి ఆలోచించగానే మొట్టమొదట తట్టినది, ద్రౌపదీ వృత్తాంతము. ద్రౌపది నల్లనిదైనా ఎంతో అందమైనదని జగద్విదితమే. ఆమె మేనిరంగు కారణంగానే కృష్ణ అనే పేరును కూడా పడసినది. మొదటి పాదము కూర్పగానే, తళుక్కమని ఒక ఆలోచన మెదిలింది.

కృష్ణ శబ్దముతో నలువురి పే ర్లున్నాయి మహాభారతంలో. కృష్ణ అంటే ద్రౌపది అనే చెప్పుకున్నాం. కృష్ణభగవానుడు ఉండనే ఉన్నాడు. శరీరఛాయ వలన ఆర్జునుడు కూడా కృష్ణుడే. ఇక మహాభారత సూత్రధారి వంటివాడు వ్యాసుఁడు, ఆయన పేరు కృష్ణద్వైపాయనుఁడు. ఆయన పేరులోనూ కృష్ణ శబ్దము ఉన్నది.  వీరిలో మువ్వురు పాండవపక్షాన ఉన్నవారే. వేదవ్యాసుఁడు ధర్మము వైపు ఉన్నవా డనుకోవడంలో ఎటువంటి సందేహానికి తావులేదు.

ఇదీ నేపధ్యం. ఇక పూరణ చూడండి.

సీ. అక్కటా వగలాడి కా కృష్ణ కారవ వరుఁడైన సుఖమంచు భ్రమసినాడొ
అంగదేశము చాల కా కృష్ణు మాయలం బడి లోభనమ్ముల సడలినాడొ
అలనాటి ఆడంగి యా కృష్ణు పాశుపతాస్త్రపు కథలకు నడలినాడొ
అడవులం జీవించు నా కృష్ణు నెచ్చటో కలసి నా కెదురేగ కదలినాడొ
 

తే. కృష్ణ శబ్దమ్ములోనున్న కితవ మేమొ
నలుపు చీకట్లు వ్యాపించెఁ నాల్గు దిశలఁ
కర్ణు డావల బోయనే కష్ట మొదవెఁ
గృష్ణ వర్ణాభిధానలు కీడు సలుప


కితవము అంటే చెడ్డది
అభిధానము అంటే పేరు
ఒదవు అంటే కలుగు.

అదండీ సంగతి.

Tuesday, March 21, 2017

నేటి పత్రికలు

నేటి పత్రికలలో ఏది నమ్మాలో, ఏది నమ్మలేమో తెలియని పరిస్థితి.

సీ. ఏది సత్యమొ మరి ఏది అసత్యమో, తేలిచి చెప్పుట వీలుకాదు
మనవాడు పలికిన మాట విషమయిన ఆచరణీయము అమృత మదియె
ఆవలిప్రక్కవా రాడిన సూనృతము తెవులుగొనిన వీరి చెవుల బడదు
మానవతావాద మానవాలు మతవాదముల బడినదయి సమసిపోయె   
ఆ.  నిజము చాటుచు తమ నిష్పక్షపాతము
కవచమై వెలుంగ ఘనముగాను
నిలిచి సత్యమునకు నెలవులౌ పత్రికల్
కాలగర్భ మందు కలసిపోయె

అలనాటి ప్రఖ్యాత బాణీ ఒకటి ఉంది.  తోడికొడళ్లు చిత్రములోనిది. కారులో షికారు కెళ్లే...పాట. దానికి హాస్యానుకరణ, మన పత్రికల పరిస్థితి. నేటి పత్రికల కలము లెంత విషమయమైనవో కదా.



హాస్యానుకరణ పల్లవి : జోరుగా పుకారు లల్లే, చొప్పరాతల పత్రిక పేనా
తగ్గకుంటే టక్కరిపనులు, తన్నిపోదురే తాళగలవా?
కన్నుగానక కల్లలెన్నియొ, కళ్లుగప్పుచు వల్లెవేస్తే
వాటి కూళపు పాళి నీకు వచ్చి చేరెను తెలుసుకో..
జోరుగా పుకారు లల్లే, చొప్పరాతల పత్రికపేనా
మురుగుపడిన నీ సిరాను మార్చు, మురికి విరిగతే కదా నిఖార్సు

౧ చరణం : బలిసి నీతి వీడినావే, తులువ చేతల తొట్టి  పేనా
తెలివి నీకు లేకపోయె, ఖలుల చేతుల చిక్కి పేనా
చీడపట్టిన కలము నీవు ఎలా మారి నా వింత త్వరగా
తరలినావే త్రెళ్లువార్తల తపనపెరిగి ధర్మం బుడిగి
పరువుపోయెను పాత్రికేయుల చొరవతగ్గుట లేదొకో
తారులో వికారవర్ణము చేరి అబ్బెనె పత్రిక పేనా 
మురుగుపడిన నీ సిరాను మార్చు, మురికి విరిగతే కదా నిఖార్సు

౨ చరణం
గాలిలాగ తేలిపోయే కల్లబొల్లి కబురుల పేనా
అడుగుఅడుగన ఇంతవిజయం ఎలా వచ్చెనో చెప్పగలవా
తెలివిమాటల విధమూవివరణ దేశమంతా నమ్మినారే
బొంకమాటల బొక్కసమ్ములు నింప లేవిక తెలుసుకో
తారులో వికారవర్ణము చేరి అబ్బెనె పత్రిక పేనా 
మురుగుపడిన నీ సిరాను మార్చు, మురికి విరిగతే కదా నిఖార్సు

Monday, March 20, 2017

జీవితంలో చరము

ఒక చరము (సెల్ఫోను) చేతి కందితే అంతకన్నా మహాప్రసాదం లేదు, పెద్దలకూ పిన్నలకూ నేడు.

తే. ఆటల మయిదానము చేతి కందివచ్చె
నురకలు పరుగులు తెరల నొదిగిపోయె
కనులు చేతివ్రేళ్లు విడిచి కదుల వేవి
జగము నింపుకొనె దనలో చరము భళిర


మరింత చెప్పాలంటే, వెలుగునీడలు అనే పాతచిత్రంలోని ఈ క్రిందిపాటను ఒకసారి గుర్తుచేసుకోండి. అదే బాణీలో ఈ సాహిత్యాన్ని పాడుకోండి. 



హాస్యానుకరణ పల్లవి -
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 1. జాలము, ముఖపుస్తకములతో కాలహరణమేగా
చదువలన్ని చంకలునాకే తుది పద్ధతులేగా
ఓ ఓ ఓ ఓ
చివరి కింక వివరములన్నీ క్షవరముతో తెలియునుగా
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 2. విలువలేని వ్యాఖ్యానములూ వెఱ్ఱివాద మేలా
నిజము లేని వార్తలగనులే నెగడి త్రవ్వనేలా, ఓ ఓ ఓ ఓ
పూట కొక్క చేటుని, పోగుచేయు టెందుకో
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 3. అగాథమే అంతర్జాలం, ఆచితూచి అడుగేస్తే
మోసాల వలలను త్రుంచే, ముదమున్నదిలే
ఉచితముగా వచ్చే వన్నీ, ఊరకనే పోవును
కీడెంచి మేలెంచాలి అదియే క్షేమతరం

మనవారికి దినచర్యలో చరము....