ఆ. రాజకీయ మందు రాచపదవు లందు విజ్ఞు డున్న చోటె నజ్ఞు డుండు మేటి సంస్థలందు మేరు స్థానములందు విజ్ఞు డెదుగు చోట నజ్ఞు డుబ్బు
ప్రేరణ: ౧. Some people grow, other people swell. You'd better figure out who you are - John Weinberg, Senior partner and Chairman, Goldman Sachs, 1976-1990 Goodbye Gordon Gecko పుస్తకము నుండి సంగ్రహించినది ౨. In Washington some men grow, others merely swell - Woodrow Wilson, American president, 1913-1921 Anatomy of a murder పుస్తకము నుండి సంగ్రహించినది
శ్రీకృష్ణుణి కృధ్ధునిఁ జేసి ప్రాణముల మీదికిఁ దెచ్చుకున్న గంధర్వరాజు గయుడు. మణిపురంబనే రాజ్యము నేలుచు పరమేష్ఠి దర్శనాభిలాషియై విమానయానముఁ జేయు సమయము నొకమాఱు, ఆతని (తమ్మ) నిష్ఠ్యూతి కృష్ణుని అర్ఘ్యాంజలి జలములో పడుతుంది. కోప వివశుఁడై గోపనందనుడు గయ శిర:ఖండన మొనర్చెదనని శపథము చేస్తాడు. ఆ ఘోర వార్త తెలుసుకొని గయుడు భయకంపితుఁడై బ్రహ్మ రుద్రాదులను రక్షింపుమని నిరర్థకముగ వేడి, రక్షింపు నాథుడుఁ గనబడమి నారదుని ఆజ్ఞమేరకు అతఁడు అర్జునుని శరణు వేడడము తత్పరిణామములు. కృష్ణార్జున యుధ్ధమునకు రంగము సంసిధ్ధ పఱచిన ఘనత గయునిది. గయుడు శ్రీకృష్ణుని చక్రఘాతము నుండి ఎవ్విధి తప్పించుకొనెనో చిలకమర్తివారు నూఱేండ్లకుఁ బూర్వము ఇరవదిరెండేడ్ల చిఱుతఁబ్రాయమున రచిచిన గయోపాఖ్యానము చదివి తెలుసుకొనవలసినదే.
ఈ వ్యాసములో మూడు పద్యములు పొందుపఱచాను.
౧. కృష్ణార్జునయుధ్ధము
మొదటిది, కృష్ణార్జునయుధ్ధమను చిత్రరాజము లోనిది. సుభద్రను వివాహ మాడు నిమిత్తము అర్జునుడు త్రిదిండి స్వామి వేషము వేయడం చిత్రములో మొదటి ఘట్టము. కథకులు దానికి ముందు పారిజాతాపహరణ కథను చూచాయగా (నంది తిమ్మన యొక్క ప్రసిధ్ధ నను భవదీయ దాసుని పద్యముతో సహా) లాఘవంగా చొప్పించారు. అర్జునుని స్వామి వేషమంటే చేమకూర వేంకటకవి కృత విజయవిలాసములోని తృతీయాశ్వాస ఘట్టమని అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చిత్రములో ప్రవేశపెట్టిన స్వామి పేరు సజిభీ ధఫపా శ్వేకి స్వామి, శిష్యుని వలె వచ్చిన అర్జునుని వేడుక చెలికాడు పార్థుని నామముల ఆది అక్షరాలతో కుదిర్చిన విచిత్రాభిధానమది. అర్జునుడు త్రిదిండి వేషమే వేయవలసిన అవసరమేది అని అనుమానిస్తే చేమకూర కవి సుభద్ర చెలికత్తెల ద్వారా ఇచ్చిన కారణ మిదిగో. వేఱు స్వాములైతే గుండు గీసుకొని రావసి వచ్చేది.
క. వాసవి త్రదిండి వేసము, వేసి గదా మేలు సేసే వెస, జన్నిదమే వేసికొనవచ్చు నీసిగ, వేసికొనం గూడదండు వేసము వేయన్
గుండు చేసుకొని సుభద్రను ప్రేమలో పడవేయడం కిరీటికి సాధ్యమో కాదో మన మెఱుగము గానీ, కష్టతరమని ఆతడు తలఁబోసి యుండవచ్చు. ఈ విషయములో నేటి యువకులు అర్జునినితో తప్పక ఏకీభవిస్తారు. కృష్ణార్జునుల యుధ్ధ సంభారాలు మొదలయినప్పటి నుండి వారి నడుమ నలిగిపోయింది సుభద్ర - చిలకమర్తి వారి నాటికలో ఆమె పాత్ర ఎన్నో గొప్ప పద్యాలు ప్రేరేపించింది. అందువల్ల చిత్రంలో ఆమెకు ప్రాముఖ్యత నివ్వడం సబబే.
సరే, ఇక కృష్ణుని శపథపు పద్యాల వైపు దృష్టి సారిస్తే...
సందర్భము సుపరిచితమే. ఉదయభానుని పూజకై వచ్చిన కృష్ణుని కోపావేశుని చేసిన గయుడు. ఆ సందర్భములో ఘంటసాల వెలువడిన శపథమిదిగో.
మ. ధరణీ గర్భము దూరుగాక వడి పాతాళంబునన్ జేరుగా క రహస్యంబున దిగ్గజేంద్రముల వెన్కన్ దాగునే గాక ఆ హరబ్రహ్మాదులె వాని రక్షణకుఁ దోడై వత్తురే గాక ము ష్కర గంధర్వు శిరంబుఁ ద్రుంచెద మహోగ్రకౄర చక్రాకృతిన్
౨. గయోపాఖ్యానము
రెండవది గయోపాఖ్యానమను నాటకములో కృష్ణ శపథము. స్థూలముగా ఆ నాటక కథను పైన చెప్పుకున్నాము కదా. ఇక శ్రీకృష్ణుని శపథమిది.
చ. జలనిధు లింకుగాక, కులశైలము నేడును గ్రుంకుగాక యా జ్వలనుఁడ వేఁడిమిన్ విడిచి చల్లదనంబు దాల్చుఁగాక, యీ జలజ హితుండు పశ్చిమ దిశన్ జనియించెడుఁ గాక, యింక నా ఖలు గయు నుత్తమాంగమును ఖండనచేసేదఁ జక్రధారలన్
ఒకటి మత్తేభము, రెండవది చంపకమాల. ఒకదానికొకటి తీసిపోదు. రెంటిలో కృష్ణుని కోపము, ఎవ్వరు అడ్డువచ్చినను ఇక గయుని కాపాడు వారు ఉండరని, వాని శిరస్సును చక్రమున కెర చేసెదనను కృష్ణుని కఠోర శపథము తెలుస్తుంది.
ఇట్టి కఠోర శపథమునకు గురైన వారెవరు భయపడరు? గాలి సడి విని కూడ కృష్ణు చక్రము సమీపిస్తోందేమో అని భ్రమకు లోనయ్యి భయపడేవాడు గయుడు. చివరకు అతనికి నారదుని సూచనలే ప్రాణాపాయ విమోచనములై రక్షించాయి.
పై పద్యాలు చదివి ఉత్సాహితుఁడనై నేను వ్రాసిన శ్రీ కృష్ణ శపథమిదిగో.
లవకుశ పద్యాలు అంటే లవకుశులు పాడినవి కావుఁగాని లవకుశ పేరుఁగల సచ్చిత్రరాజ నిక్షిప్త పద్యాలని నా భావన. నేను విన్నవీ, వింటూన్నవీ, నా మనస్సును హత్తుకున్నవీ ఈ పద్యరత్నాలు. పైగా, ఘంటసాల గారి అసదృశగాత్ర సుధారసాన్విత పద్యాధారస్వాదన నిరుపమాన భాగ్యమే కదా.
మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయో ధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సం స్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్ భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా
(అన్వయము = వంశము)
తా. వశిష్ఠుడు రాముణ్ణి సంహాసనారూఢునిఁ జేసి పల్కిన వాక్కులివి. "నవరత్న ప్రభాజితమైన ఈ కిరీటము పూర్వము సూర్వవంశీయ రాజులు ధరించి రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించారు. ఈ ఘనమైన కిరీటము నీవు ధరింపఁదగినది. ధరించి ఇధ్ధరను మోదముతో ప్రజామోదగా పాలింపవయ్యా రఘువంశీయుడా"
ఉ. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సు త్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీ తా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగా నీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా
(సుత్రాముడు = ఇంద్రుడు, హవ్యవాహనుడు = అగ్ని) రఘువంశ కీర్తిప్రతిష్ఠలకు కళంకముఁ దెచ్చు నపవాదు ప్రజలలో వ్యాప్తము కాకమున్నె రాజ్యపరిత్యజమో, కళత్రపరిత్యాగమో చేయవలనని సంకల్పించియున్నవాడు శ్రీరాముడు. పట్టముఁ గట్టించుకొనుటకు తమ్ములెవ్వరూ ముందుకు రారయ్యె, భార్యావియోగమే మార్గమయ్యె. సీతను భగీరథీ నదతీరము వద్ద విడిచిరమ్మని లక్ష్మణుఁ నాజ్ఞాపించెను. ఆ క్షణమున లక్ష్మణుని ఆక్రోశమే ఈ పద్యము
తా. "అనుదినము నీ పాదములకు దండము పెట్టుకుని నీ ఆశీస్సుల తీసుకొని వెడలు వాడను, ఇక అట్టి భాగ్యము నాకు దూరమవుతున్నది కావున, చివరి సారి శతనమస్కారములు స్వీకరించుమమ్మా, సీతమ్మా" అని బాధపడు లక్ష్మణుడు. ఒక్క మాటు కిష్కింధకాండ గుర్తుతెచ్చుకోండి. ఆకాశము నుండి పూర్వము ఒక స్త్రీ పడవేసిన నగల మూటను రామసౌమిత్రుల వద్దకు తీసుకువస్తారు వానరులు. ఆ అబల సీతయై యుండవచ్చునని ఊహించిన రాముని మనస్సులో పెల్లుబికిన బాధవల్ల కన్నులు చెమర్చినాయి. నగలని చూడలేక, ప్రక్కనే ఉన్న లక్ష్మయ్య చేతఁబెట్టి గుర్తించమన్నాడు. నగలను పరికించి చూచి, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వభి జానామి నిత్యమ్ పాదాభివందనాత్ అని బదులు చెప్పాడు ఆ సౌశీల్య గుణగరిష్ఠుడు. పై పద్యం వింటూంటే ఈ శ్లోకం గుర్తుకు రాదూ?
ఇంత జరిగినా, పరుషమైన వాక్యము నొక్కటైనా పలికిందా మన సీతమ్మ తల్లి? లేదే. అడవి క్రొత్తకాదు, పదమూడేళ్ళ పాటు వసించిన తలమే, కానీ ఈ మాటు ప్రాణేశ్వరు డండగా లేక అల్లల్లాడిపోయింది. అయినా, కల్లోలితి మానసియైనా, లక్ష్మణునితో తమ వారందఱి క్షేమము లడగగలిగిందంటే - తల్లి భూదేవి సహనసౌశీల్యమంతా అబ్బింది కదా అని అబ్బురపడవలసిందే. ఒంటరియై, భీతచేతస్కురాలై, అలసి మూర్ఛిల్లిన సీతను చూచి భూమాత తట్టుకొనలేక పోయింది. రాముని మీద, ఆయోధ్యా పురవాసులపైన నిప్పులు చెండినది.
ఉ. రాజట రాజధర్మమట రాముడు గర్భిణియైన భార్య రు ద్రాజ సురాసురల్ బొగడ అగ్ని పరీక్షకు నిల్చినట్టి వి భ్రాజితఁ బుణ్యశీల నొక బాలిశు మాటకు వీడినా డయో ధ్యాజననాథు డెంత కఠినాత్ముడొ నేను క్షమింపఁ జాల నా రాజును రాజ్యమున్ ప్రజల, రండు ప్రతిక్రియఁ జేయ రుద్రులై
(బాలిశుడు: మూర్ఖుడు)
అయోధ్యా పురి ఆ కోపావేశానికి తట్టుకోలేక పోయింది. ఆ కష్టసమయంలో వారి కెవరు దిక్కు? సీతమ్మ తల్లి కాక మరెవ్వరు?
అదృష్ట వశాన వాల్మీకి ఆశ్రమఛాయలకు చేరుతుంది జానకి. అత్యంతాదరణానురక్తులతో ఆశ్రమవాసులు ఆమెకు స్వాగతము పలుకుతారు. అయోనిజ దురదృష్టానికి చింత కలిగినా, ఆమెకు ఆతిధ్యమిచ్చే భాగ్యము తమదైనందుకు ఆశ్రమవాసుల ఆనందానికి అవధులు లేవు. వాల్మీకి స్వాగత వచనా లివి.
చ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీ సదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్ ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో
ఈ కాలపు మనుష్యులకి (ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలలో పని వెలగబెట్టే రకాలకి) లోకపు భారమంతా తామే మోస్తున్నామన్న భ్రమ అధికమవుతోంది. ప్రతి ఒక్కడూ ఒక చిన్న ఢంకాయే.
‘ఆఫీసులో నేను లేకపోతే క్షణం సాగదు’ ‘మా బాసు నేను లేందే అడుగు తీసి అడుగు వేయలేడు’ ‘ముప్పై మిలియన్ డాలర్ల్ ప్రాజెక్టుని ఒక్క చేత్తో నడుపుతున్నాను. ఇంతకు ముందిలాంటివి ఎన్నో చేసాలే, అందుకే పెద్ద విషయం కాదు’ ‘కంపెనీ వారు నా పనికి మెచ్చుకొని కాన్ఫరెన్సుకి హవాయి పంపుతున్నారు. సంస్థ మొత్తంలో ఇద్దరినే ఎన్నుకున్నారు - మనకి ఇలాంటివి అలావాటేలే’
ఏ తుట్టని కదిపినా ఇదే రొద.
ఈ సోదిపెట్టే మొహాలమీద చెంప పెట్టులా రామాయణంలో హనుమంతుని సౌశీల్యము గరించి చెప్పాలి. హనుమంతుని బలాబలాల గురించి వేఱుగా చెప్ప నవసరం లేదు కానీ, ఆ మహనీయుని వినమ్రత, సౌశీల్యము చూసి నేర్చుకోవలసినది మాత్రం చాల ఉంది. హనుమ గొప్పతనానికి మచ్చుక నాలుగు ఉదాహరణలు క్రింద ఉన్నాయి. అలాంటి గొప్పవాడు, లంకకు వెళ్ళి సీతను చూచి, తిరిగి వెళుతున్నప్పుడు, ‘సీతమ్మ తల్లి పాతివ్రత్యం వల్ల నేను ఇంతటి ఘనకార్యాన్ని నెరవేర్చగలిగాను కానీ, నాదేముంది ఇందులో’ అనుకుంటాడు, ఎవరికి సాధ్య మది?
===
1) శ్రీరాముడు ఋష్యమూక పర్వతం వద్ద హనుమంతుణ్ణి కలిసిన కొద్ది సేపటికి నుడివిన పలుకులవి.
(తాత్పర్యము: లక్ష్మణా, చూసావా ఇతని వాక్చతురత, సామాన్యులు ఇంత చక్కగా మాట్లాడగల రంటావా? ధైర్యవంతుడైన ఇలాంటి దూత ఒక్కడుంటే చాలుఁగా విజయలక్ష్మిని తీసుకురాను. ఇతడి స్నేహాన్ని ఎన్నడూ విడువబోకు)
2) సముద్రమెటుల లంఘించుటాయని వానరవీరులు తర్జనభర్జనలు చేయు సమయమున జాంబవంతుని పల్కులివి
(తాత్పర్యము: తఱచి చూడగా ఈ వీరయోధులలో ఎవరికీ నీకున్న ఔన్నత్యము లేదని తెలుస్తుంది, వానరులలో ఉత్తముడా, వాయుపుత్త్రుడా, కుబేరుడు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలుగు వారు ఎన్నో వరములు నీకు ఇచ్చిన కతన నీవు ఎక్కవ శ్రమలేకుండానే గొప్పవాడవయ్యావు కదటయ్యా, పింగాక్షా -సీతమ్మను ఎలా చేరాలో తలియక మేము పడుతున్న - కష్టాన్ని తీర్చవయ్యా) 3) యుధ్ధంలో ఇంద్రజిత్తు బాణాల ధాటికి శ్రీరామ లక్ష్మణులతో పాటు వానరసేన మొత్తము మూర్ఛిల్లినది. హనుమంతుని తోడుగా విభీషణుడు జాంబవంతుణ్ణి వెతికి చేరి సేదతీర్చాడు. రామలక్ష్మణుల సుగ్రీవాంగదుల యోగక్షేమాలు అడుగక, ముందు ఆంజనేయుని క్షేమసమాచారము లడిగాడు జాంబవంతుడు. అలా అడగడానికి కారాణ మడిగిన విభీషణునికి ఆ వృధ్ధయోధుని జవాబిది.
(తాత్పర్యము: ధీరుడా విభీషణా విను, ప్రాణాలు పోయి పంక్తులుగా పడి యున్న వీరుల పాలిటి బ్రహ్మదేవుని వలె వచ్చి క్షణంలో చైతన్యము కలిగించడానికి, ఆ పని చేయబూనిన హనుమ ఒక్కడు చాలు. అతడే యుధ్ధంలో మరణిస్తే, వందలు వేలూ బ్రతికియున్నా ఈ యోధ్ధులందరూ మృత సేనలతోనే సమానము )
4) ఇక హనుమ దెబ్బ తిన్న లంకిణి మాట వేఱుగా చెప్పాలా?