Sunday, May 24, 2015

హనుమజ్జయంతి పద్యము - సీసపద్యము వ్రాస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు

హనుమజ్జయంతి సందర్భంగా, వైశాఖబహుళదశమి నాడు (మే ౨౦౧౫) పద్య మొకటి అల్లుదామని ఉదయాన్నే మొదలు పెట్టాను.

వ్రాసిన పద్యమిది.

సీ. చంటి పాపడ వయ్యు మింటి పం డనుకొని
సెగల గోళంబు పై కెగసినావు
బాలుండవై పలువేలుపుల కృపకు
బాత్రమై విద్యల బడసినావు
పెరిగి సుగ్రీవుని ప్రియసఖుడవు నయి
శ్రీరాము సఖ్యతఁ జేర్చినావు
సరవి నయోనిజ జాడ తెలియ రిపుం
గెలువ జలనిధి లంఘించినావు

తే. వృద్ధరూపము గ్రుద్ధుని భీముని బల
మల్పమని తెలిపి గరువ మడచినావు
రామభక్తికి రూపమై భూమిజనుల
నిండు హృదయములం జిరంజీవి వీవు

పద్యం చదువుతూంటే, మధ్యలో  అక్కడక్కడా నడక నట్టుపడినట్టు అనిపిస్తుంది. భావము సులువుగానే తెలిసినా నడక కాస్త సడలితే సీసపద్యములోని అందం మందగిస్తుంది.

అదే విషయం చెప్పి ఛంద స్సనబడే ఫేస్బుక్కు సమూహములో,  ఎత్తుగీతిలోని పాదాలను ఎవఱైనా కాస్త మార్పుతో నడకను సవరింపగలరేమో చూద్దామని అదే ప్రశ్న వేసాను.

దానికి ప్రతిగా ధనికొండ రవిప్రసాద్ గారు చక్కటి మార్పును సూచించినారు.  పైన ఎఱుపు రం గద్దిన నాలుగవ పాదానికి వారు సూచించిన మార్పు లివిగో.

సరవి సీతాసాధ్వి జాడ కన్ గొని రిపున్ గెల్వ సంద్రమ్ము లంఘించినావు అంటే బాగుంటుంది.అలాగే "మల్పమని తెల్పి గర్వ మడంచినావు. వృద్ధ రూపాన ఇలా వాడితే బాగుండి నడక సాఫీ గా ఉంటుంది.సీసము , గీతి, మొదలైన వాతిలో భగణము, నలము అనే చతుర్మాత్రా గనాలు ఇంద్రగణాలే అయినప్పటికీ సాధ్యమైనంతగా పంచమాత్రలైన ఇంద్రగణాలు వాడితే ఈ పద్యాలు అందంగా ఉంటాయి.

రవిప్రసాద్ గారు సూచించిన మార్పుతో, సరవి సీతాసాధ్వి అంటూ నడక చాలా సులువుగా సాగిపోయింది.

అసలు, ఆ పాదము ఎలా తయారయ్యిందో చూస్తే సీసపద్యము వ్రాసే టప్పుడు తీసుకోవలసిన ఒక జాగ్రత్త సుస్పష్టమవుతుంది.  మొదటి మూడు పాదాలూ, ఏదో ఒక విధంగా,  చేత వ్రాసే సాధనమేదీ లేకుండా మనసులోనే పాడుకుంటూ వ్రాసినవి. సీసపద్యాన్ని వ్రాసుకుంటూ పాడితే, గణాలను కిట్టించినట్టు కాకుండా, చదువరులకు గతుకులు తెలియకుండా నడక సాగుతుంది. ఎందుకంటే, పాడుకుంటూ వ్రాస్తే మనకే ఆ గతుకులు ముందుగా తెలిసేది.  వెంటనే వాటిని సవరించడానికి ప్రత్యామ్నాయపదాలు వెతుకుకోవచ్చు.

నాలుగవపాదం, ఆ మాట కొస్తే, ఎత్తుగీతి మొత్తం, నేను కార్యాలయంలో కూర్చుని, పనిలో పడి, ఒక ప్రక్క ఆ పనులు చూస్తూ, మఱొక ప్రక్క వీలు దొరికినప్పుడు, చరములో చిన్న పదాలు చేర్చుకుంటూ వ్రాసినది. దాంతో, గణాలు కిట్టించడమే పనిగా మారింది కానీ, పాడుకొని పద్య మెంత చక్కగా సాగుతోందా అని చూసుకొనే వీలు కలుగలేదు. 

పద్యం పూర్తియిన పిమ్మట, మొత్త మొకసారి చదివితే, గతుకులు తెలిసాయి.  అలాంటప్పుడు పాదాన్ని మొత్తం తిరగవ్రాయాలి తప్ప చిన్న చిన్న మార్పులు పనికిరావు. రవిప్రసాద్ గారు చేసింది అదే పని.

తుది మాటగా, గీతపద్యాలు వ్రాసే వారు తప్పక గుర్తుంచుకోవలసినది, పై అనుభవంతో బోధపడిన విషయ మేమిటంటే..

పద్యాలు పాడుకుంటూ వ్రాయాలి 

No comments:

Post a Comment